ఆంధ్రప్రదేేశ్ రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని డీజీపీ తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్నా భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలు పరచడానికి సాధ్యాసాధ్యాలను పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం అధికారులతో చర్చించాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో గత సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశామన్నారు. అంతేకాకుండా 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతో పాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామన్నారు, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని తెలిపారు.
కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారన్నారు. ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు సిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది MO అఫెండర్స్ ను ఇప్పటికే గుర్తించామని, వారందరినీ కూడా జియో మ్యాపింగ్ తో అనుసంధానం చేశామని తెలిపారు. వీరిపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్ ను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో దేవాలయాలకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్/dail100, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.